స్వసుఖాలకంటే సామూహిక శ్రేయానికే పాటుపడటం సత్పురుషులకు సహజాలంకారం. 'తమ కార్యంబు పరిత్యజించియు బరార్థ ప్రాప్తకుల్ సజ్జనుల్...' అన్నాడు సుభాషితకర్త భర్తృహరి. అలా- పరోపకారమే పరమావధిగా తమ జీవిత ప్రస్థానం సాగించిన మహనీయులు ప్రజల గుండెల్లో భగవత్ స్వరూపులుగా కొలువై ఉంటారు. రామానుజాచార్యుల చరితమే అందుకు దృష్టాంతం.


'మ్రోడు మందారాలు పెడుతుంది/ అటు చాపి, ఇటు చాపి అభయహస్తాలల్లి/ జగమంత పందిరిని కడుతుంది' అంటూ చెట్ల జీవలక్షణాన్ని అక్షరీకరించారు కృష్ణశాస్త్రి ఓ కవితలో.శాశ్వతంగా జీవితం మోడువారే వేళ- పరోపకారానికి పందిరి పరవడం ద్వారా- తాము లేకున్నా తమ పేరు నిలిచిపోయేలా పుట్టుకను సార్థకం చేసుకుంటున్నవారెందరో. మరణానంతరమూ సమాజానికి ఉపయోగపడాలన్న సదాశయంతో- వైద్య పరిశోధనల నిమిత్తం తమ పార్థివ శరీరాన్ని ఆసుపత్రులకు అప్పగించాలని ఆకాంక్షిస్తున్నవారున్నారు. లోకమంతా చీకటైపోయినవారికి తమ కళ్లతో వెలుగులు పంచాలని కోరుకుంటున్నవారున్నారు. ఆ మేరకు వాగ్దాన పత్రాలపై వారు సంతకాలు చేస్తున్నారు కూడా. ప్రమాదవశాత్తో, ఇతరత్రానో మృత్యుముఖంలోకి వెళ్లిన తమ పిల్లల అవయవాలను- ఇతరులకు అమర్చడానికి పెద్దమనసుతో సమ్మతి తెలుపుతున్న తల్లిదండ్రులున్నారు. ఓ చిన్నారి... ముప్ఫై ఏళ్లలోపు వయసున్న ఓ జంట కలల పంట... పుట్టిన నాలుగోరోజునే కనుమూసింది... అమ్మకు, అయ్యకు గుండెకోత మిగిల్చి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది ఈ మధ్యనే... పుట్టెడు దుఃఖాన్ని పంటిబిగువున అదిమిపట్టి ఆ తల్లి తన పసికూన అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చింది. భర్త, బంధువులు ఆ మహత్కార్యాన్ని ప్రోత్సహించారు. ఆ కసిగందు హృదయనాళాలను ఇద్దరు పసివాళ్లకు, కళ్లను మరో ఇద్దరు బిడ్డలకు అమరుస్తామంటున్నారు వైద్యులు. అమ్మ పక్కలో పడిన తరవాత నాలుగు రోజులకే మృత్యుఒడిలోకి చేరిన పాప- భౌతికంగా లేకపోవచ్చు. కానీ, ఆ చిట్టితల్లి- తన హృదయనాళాలు అమర్చిన ఇద్దరు చిన్నారుల ప్రాణస్పందనలో ఉంటుంది. తాను దృష్టి ప్రసాదించిన మరో ఇద్దరు చిన్నారుల కళ్లల్లోనుంచి ఈ లోకంలోని అద్భుతాలను, సౌందర్యాన్ని వీక్షిస్తూనే ఉంటుంది. 'మృతినెరుంగని ఒంటిదేవతలకన్న/ నలుగురికి మేలు చేసెడి నరుడె మిన్న' అన్న గాలిబ్ సూక్తికి ప్రతిబింబమై వెలుగులీనుతూనే ఉంటుంది!
(ఈనాడు, సంపాదకీయం, ౨౫:౦౭:౨౦౧౦)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి